శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (13:28 IST)

యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు కష్టాలు: రెండో రౌండ్లో పేస్-హింగిస్ జోడీ

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు కష్టాలు తప్పట్లేదు. కెనడా భామ ఎజేని బౌచర్డ్ కూడా మూడో రౌండుకు చేరిన నేపథ్యంలో, రెండో రౌండ్‌ను అధిగమించేందుకు సెరెనా చెమటోడ్చింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, టాప్‌ సీడ్‌ సెరెనా 7-6 (7/5), 6-3తో వరుస సెట్లలో క్వాలిఫయర్‌ కికి బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచింది. 
 
తొలిసెట్‌లో సెరెనాకు బెర్టెన్స్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో టై బ్రేకర్‌ తప్పలేదు. అయితే రెండో సెట్లో పుంజుకున్న సెరెనా.. ప్రత్యర్థికి మరో చాన్స్‌ ఇవ్వకుండానే మ్యాచ్‌ ముగిచింది. ఇక 23వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ 6-3, 6-7 (2/7), 6-2తో ఎరీనా ఫాల్‌కోని (అమెరికా)పై గెలిచింది. 
 
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత స్టార్‌ లియాండర్‌ పేస్‌-మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ పేస్‌-హింగిస్‌ జోడీ 6-2, 6-2తో వరుస సెట్లలో క్లేర్‌ లియు-ఫ్రిర్ట్‌జ్‌ (అమెరికా) ద్వయంపై సులువుగా గెలిచింది. కాగా పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న-మెర్జియా (రుమేనియా) జోడీ 6-3, 6-4తో క్రాజిసెక్‌-మొన్రో (అమెరికా) ద్వయాన్ని ఓడించింది.