రూ. 60 లక్షల నగదుతో పరారైన ఏటీఎం క్యాష్ డిపాజిట్ వ్యాన్ డ్రైవర్
అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ వున్న ఏటీఎం క్యాష్ డిపాజిట్ డ్రైవర్, కాస్త సమయం దొరకగానే వ్యానులో వున్న రూ. 60 లక్షల నగదుతో వుడాయించాడు. ఈ ఘటన రాయదుర్గంలోని గోపనపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఏటీఎంల్లో నగదు నిర్వహణ చేసే సీఎంఎస్ సంస్థలో అజిత్ కుమార్ అనే వ్యక్తి వ్యాను డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నగదు డిపాజిట్ చేసేందుకు విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ డబ్బు దొంగిలించాలన్న దురాశ పుట్టింది. దీనితో అవకాశం కోసం వేచిచూస్తున్నాడు.
ఈ క్రమంలో మణికొండ ప్రాంతంలోని యాక్సెస్ ఏటీఎం కేంద్రంలో నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు నగదు డిపాజిట్ చేసేందుకు వ్యానులో వున్నవారు వెళ్లారు. ఆ సమయంలో వ్యాను దగ్గరే వున్న సెక్యూరిటీ గార్డు కాస్త వాష్ రూంకి వెళ్లాడు. అదే అదనుగా వ్యానులో వున్న రూ. 60 లక్షల నగదుతో డ్రైవర్ అజిత్ పరారయ్యాడు. పోలీసులు జీపీఎస్ ద్వారా ట్రేస్ చేయగా అతడు తెల్లాపూరులో వున్నట్లు గుర్తించారు.