శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 అక్టోబరు 2025 (12:52 IST)

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

suicide
ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఓ కానిస్టేబుల్ ఓ యువతిని శారీరకంగా వాడుకుని వదిలేశాడు. దీన్ని భరించలేని ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వాంచలో జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), గద్వాల జిల్లా చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడ్ హైదరాబాద్‌ నగరంలోని ఒక శిక్షణ కేంద్రంలో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ప్రియాంకను నమ్మించిన రఘునాథ్ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. అయితే, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత మాట మార్చి పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక జూలై 17న తొలిసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో పోలీసులు రఘునాథపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
 
అనంతరం ప్రియాంక.. రఘునాథ్ ఇంటికి వెళ్లి అక్కడే ఉండటం మొదలుపెట్టింది. దీంతో అతడి కుటుంబసభ్యులు తమ నివాసాన్ని మల్దకల్‌కు మార్చారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రియాంక మరోసారి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం డిశ్చార్జి అయింది. ఆ తర్వాత మల్దకల్‌లోని రఘునాథ్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారితో గొడవపడింది. అక్కడి నుంచి చిన్నోనిపల్లికి తిరిగివచ్చి, శీతలపానీయంలో గడ్డిమందు కలుపుకుని తాగింది. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆమెను గద్వాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది.
 
ప్రియాంక మృతికి కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు 22 మంది కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ, నిందితుడైన రఘునాథ్ గౌడను ఇప్పటికే సస్పెండ్ చేశామని, తాజాగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.