ప్రేమ-పెళ్లితో ఉన్మాది వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని యువతి ఆత్మహత్య
ప్రేమించాలని ఓ ఉన్మాది వేధింపులకు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ, పెళ్లి అంటూ ఓ ఉన్మాది వేధింపులు తాళలేక.. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది.
టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక బాలేష్, రాజేశ్వరి దంపతుల నాలుగో కుమార్తె మాధవి (26) బీ ఫార్మసీ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేశ్ అనే సింగరేణి కార్మికుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు.
కానీ కులాలు వేరు కావడంతో అతనితో మాధవి పెళ్లికి వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.దీంతో మరింత రెచ్చిపోయిన వెంకటేశ్.. రెండు రోజుల క్రితం నేరుగా పురుగుల మందు డబ్బాతో మాధవి ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు. ఎక్కడికి వెళ్లినా వెంటపడ్డాడు.
అంతేగాకుండా వెంకటేశ్ కుటుంబం నుంచి వస్తున్న మానసిక ఒత్తిడి, బెదిరింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి.. నా చావుకు కారణం వెంకటేశ్ అని సూసైడ్ నోట్ రాసి ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
