Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు
పుట్టిన వారం రోజులకే ఓ మగశిశువును అమ్మేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గత నెల పదవ తేదీన మగబిడ్డ పుట్టాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పసికందును వారం రోజులకే కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశారు. ఈ దారుణం అంగన్వాడీ టీచర్ చొరవతో బయటపడింది.
తల్లి అంగన్వాడీ కేంద్రానికి కోడిగుడ్లు, ఇతర పోషకాహారం కోసం రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఆరా తీయగా వారు వేరొక గ్రామానికి వెళ్లినట్లు ఐసీడీఎస్ అధికారులు కనుగొన్నారు. వారిని పట్టుకుని బిడ్డ గురించి ఆరా తీయగా, అసలు నిజం ఒప్పుకున్నారు. బిడ్డను రూ.1.7లక్షలకు కామారెడ్డి దంపతులకు అమ్మేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.