రేవంత్ రెడ్డి కమలం పార్టీలో చేరొచ్చు... ప్రధాని మోడీ పిలుపునకు ఆంతర్యమిదే : బీజేపీ ఎంపీ అర్వింద్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎపుడైనా భారతీయ జనతా పార్టీలో చేరొచ్చని బీజేపీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. ఇటీవల తెలంగాణాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఇదేనని చెప్పారు.
నిజామాబాద్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అర్వింద్ మాట్లాడుతూ, ఇటీవల ప్రధాని మోడీ రేవంత్ గారూ.. నాతో కలవండి అని పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదే కావొచ్చు అని చెప్పారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారిలాగే రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారొచ్చని ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు.
ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డిల మధ్య ఏదైనా సంబంధం ఉందేమో కాను తెలియదు. నేను బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే అని అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్కు సీఎం పదవి ఇచ్చి, కాంగ్రెస్ అధిష్టానం సొంత పార్టీ సీనియర్లను మోసం చేసిందని ఆరోపించారు. కోమటరెడ్డి, శ్రీధర్ బాబు వంటివారికి సీఎం పదవి ఇచ్చివుంటే బాగుండేదన్నారు.
రేవంత్ రెడ్డి ఎపుడు ఎటు వెళతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అర్వింద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్నిబట్టి చూస్తే మరో పదేళ్లపాటు ప్రధానిగా నరేంద్ర మోడీయే ఉంటారని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని విశ్లేషించారు.
