ప్రయాణికులకు అలెర్ట్ : 18 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
కాజీపేట - కొండపల్లి మార్గంలో ఇంటర్ లాకింగ్, ఇతర ఇంజనీరింగ్ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే రైళ్లలో 18 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్లో డోర్నకల్, గుండార్తిమడుగు స్టేషన్ల మధ్య 3వ లైన్ ట్రిప్లింగ్ నిర్మాణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు, ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
రద్దు చేసిన రైళ్లలో కాజీపేట, విజయవాడ - డోర్నకల్, సికింద్రాబాద్, విజయవాడ - భద్రాచలం, మణుగూరు, విశాఖపట్టణం - పాలమూరు, రైళ్లతో పాటు కాకినాడ టౌన్, లింగంపల్లి రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ ప్రయాణాల్లో ఇబ్బందులు కలగకుండా రైల్వే ముందస్తు ప్రకటన జారీచేసింది.
