రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్లో రోడ్డు దాటుతున్న తరుణంలో కారు ఢీకొన్న ఘటనలో ఓ వైద్య విద్యార్థిని మృతి చెందగా, ఆమె తండ్రి గాయపడ్డారు. నగర శివార్లలోని హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టిసి కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
యమసాని ఈశ్వర్య (19) తన తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఈశ్వర్య తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన ఈశ్వర్య మహబూబ్నగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ (రెండో సంవత్సరం) చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.