తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళా మంత్రులను భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయంగా పలుకరించి, వారిని సన్మానించారు. ఆ తర్వాత అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర తాంబూలాలతో సత్కరించారు. ఈ సత్కారం అందుకున్న వారిలో మహిళా మంత్రులు, సీతక్క, కొండా సురేఖలు ఉన్నారు.
వారు గురువారం మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను, మేడారం ప్రసాదాన్ని అందజేశారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న జాతరను సందర్శించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందు స్వీకరించిన మంత్రులు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆహ్వానం పలికారు.
