కాంగ్రెస్, బీఆర్ఎస్లకు షాకిచ్చిన తెలంగాణ జాగృతి - ఏకంగా మున్సిపాలిటీ కైవసం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో శుక్రవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో జనసేన పార్టీ తొలిసారి బోణీ కొట్టింది. అలాగే, భారతీయ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్కు గురైన తెలంగాణ జాగృతి నాయకురాలు కె.కవిత వర్గం ఎవరూ ఊహించని ఫలితాన్ని సాధించింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకురాలు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు ఏఐఎఫ్బీ పార్టీ తరపున మొత్తం 10 వార్డుల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏఐఎఫ్బీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో వార్డును దక్కించుకున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీకి 44, బీఆర్ఎస్కు 10 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు 884 వార్డులు, బీఆర్ఎస్ 464, బీజేపీ 136, ఇతరులు 137 స్థానాల్లో గెలుపొందారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో పోటీ చేసిన జనసేన అభ్యర్థి తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్నిచ్చింది.
నిజానికి ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సివుంది. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదేసమయంలో పార్టీ శ్రేణులు మాత్రం తమకు పట్టున్న స్థానాల్లో 200కు పైగా స్థానాల్లో పోటీ చేశారు.
వీటిలో నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక నాయకత్వం, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపునకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేరేడుచర్లలో జనసేన కార్యకర్తల్లో ఇపుడు మంచి జోష్ కనిపిస్తోంది.