తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విషాదం... నిరసన
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు ఒకవైపు, విషాదకర ఘటనలు, నిరసనలు మరోవైపు చోటుచేసుకుంటున్నాయి. అనేక గ్రామాల్లో తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో డబ్బులు తీసుకున్న ఓటర్లు తమకు ఓటు వేయడం లేదని ఆరోపిస్తూ సెల్ టవర్లు ఎక్కి నిరసలు తెలుపుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార ఒత్తిడిని భరించలేక గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు.
తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో సర్పంచి అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడి సర్పంచి స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
మరోవైపు, మెదక్ జిల్లా నార్సింగిలో సర్పంచి అభ్యర్థి భర్త శంకర్ నాయక్ సెల్ టవర్ ఎక్కాడు. ఆయన భార్య నర్సంపల్లి పెద్దతండా పంచాయతీ నుంచి సర్పంచి పదవికి పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులు ఓటుకు రూ.2 వేలు పంచుతున్నారంటూ శంకర్ నాయక్ సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గతంలో తాను సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.