గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 12 మే 2015 (17:37 IST)

నబీల్ హత్య : నిందితులకు అండగా సీఐ... పోస్ట్‌మార్టం నివేదిక సిద్ధం!

హైదరాబాదులోని పాతబస్తీ స్ట్రీట్ ఫైట్లో మరణించిన నబీల్ మహ్మద్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సిద్ధం చేసి పోలీసులకు అందించారు. అతనికి 9 బలమైన దెబ్బలు తగిలాయని, తల, పక్కటెముకలు, కడుపులో బలమైన పిడిగుద్దులు తగలడంతో నబీల్ చనిపోయాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
 
అంతేగాక తలకు రెండువైపులా పిడిగుద్దులు తగిలాయని, స్ట్రీట్ బాక్సింగ్ జరిగిన స్థలంలోనే నబీల్ చనిపోయాడని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు స్ట్రీట్ ఫైట్ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల తల్లిదండ్రులను మంగళవారం సౌత్ జోన్ డీసీపీ ఆఫీసుకు పిలిపించారు. వారి సమక్షంలోనే నిందితులకు డీసీపీ సత్యనారాయణ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. 
 
మరోవైపు.. నబీల్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు ఓ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ చక్రం తిప్పినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్థారించారు. స్ట్రీట్ ఫైట్‌లో నబీల్‌ గాయపడిన రోజే ఆస్పత్రిలో అతని మృతిపై వైద్యపరమైన కేసు నమోదు చేయకుండా సీఐ అడ్డుకున్నారని సమాచారం. 
 
అయితే మీడియాలో ఈ బాక్సింగ్‌ దృశ్యాలు రావడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో కేసు విచారణ సాగించారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో సీఐ ప్రమేయంపై పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అదేవిధంగా ప్రేమకోణంలోనూ విచారణ సాగుతోంది. నబీల్‌, అతని స్నేహితులు అరేబిన్‌ గ్యాంగ్‌ పేరిట కొన్నాళ్లుగా స్ట్రీట్‌ఫైట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.