మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:16 IST)

తండ్రి వేసుకునే బీపీ - షుగర్ మాత్రలు మింగిన బీఫార్మసీ విద్యార్థిని

ఘట్‌కేసర్ కిడ్నాప్ నాటకం ఆడిన బీఫార్మసీ విద్యార్థిని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తాను చేసిన పనికి పోలీసుల నుంచి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ఈ విద్యార్థిని తీవ్రమైన మానసకి ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగి ప్రాణాలు కోల్పోయింది. 
 
కిడ్నాప్ ఉదంతం, కేసు విచారణ పూర్తయిన అనంతరం విద్యార్థిని ఘట్‌కేసర్‌లోని తన అమ్మమ్మ ఇంట్లోనే ఉంటోంది. జరిగిన సంఘటనలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అప్పట్నుంచీ ఆహారం సక్రమంగా తీసుకోవట్లేదు. 
 
మంగళవారం అనారోగ్యంతో బాధపడుతుండంటంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి.. గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. గాంధీ వైద్యులు పరీక్షించి.. మానసిక ఒత్తిడి వల్లనే అలా ఉందని తెలిపి, బుధవారం ఉదయం మరోసారి ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.  
 
దీంతో ఆమెను తీసుకుని తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. విద్యార్థిని తండ్రి షుగర్‌, బీపీ మాత్రలు వేసుకుందామని చూడగా.. వాటిలో 15 మాత్రల దాకా తక్కువ ఉన్నట్టు గమనించారు. ఆ మాత్రలు మింగడం వలనే మంగళవారం తమ కుమార్తె అస్వస్థతకు గురైందని నిర్ధారించుకున్నారు. 
 
బుధవారం ఉదయం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆసత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం యువతి అమ్మమ్మ ఇంటివద్దే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.