శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (12:10 IST)

తెలంగాణలో 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత?

తెలంగాణలో ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వ్యవసాయ సీజన్‌ వేగం పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేతను అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. 
 
మంత్రిమండలి సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేయాలి. మరోవైపు పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి. సీఎం జిల్లా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను ప్రారంభించడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు.
 
ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం జరిగేది అనుమానంగా మారింది. ఆ పరిస్థితి ఉంటే సీఎం కేసీఆర్‌ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆదేశాలు ఇచ్చే వీలుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారిగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది.
 
లాక్‌డౌన్‌ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.