గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీ.. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్!

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏడేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
 
ఆహార భద్రత కార్డుల మంజూరు కోసం పెండింగ్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌కు పౌరసరఫరాల శాఖ కసరత్తు వేగవంతం చేస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో పెండింగ్ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఆగిపోయింది. కార్డుల్లో తప్పులు సరి చేయడం, వ్యక్తుల పేర్లు, వివరాలు తొలగించడం, చేర్చడం వంటివి కూడా నిలిపివేశారు.
 
కాగా రాష్ట్రంలో ఇప్పటికే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద 53 లక్షల 55 వేల 797 కార్డులకు గానూ కోటి 91 లక్షల 69 వేల 619 మంది లబ్దిదారులున్నారు. వీరికి అదనంగా రాష్ట్రం ఇచ్చిన 33 లక్షల 85 వేల 779 కార్డుల ద్వారా 87 లక్షల 54 వేల 681 మంది లబ్దిదారులున్నట్లు పౌరసరఫరాల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
 
తాజాగా 4 లక్షల 46 వేల 169 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రివర్గంలో చర్చజరిగింది. ఇవి కాకుండా జిల్లాల్లో రేషన్ కార్డు కోసం వేలాది దరఖాస్తులున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 2014 నుంచి 2021 వరకు లక్షా 70 వేల 262 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. హైదరాబాద్‌ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5 లక్షల 85 వేల 39 కార్డులు ఉండగా 21 లక్షల 85 వేల 668 యూనిట్లున్నాయి. 
 
సగటున మరో మూడు లక్షల కుటుంబాలకు పైగా కార్డులు లేవు. కాగా గత ఆరు నెలల వ్యవధిలో మీ సేవ అధికార లెక్కల ప్రకారం కొత్త కార్డుల కోసం సుమారు 2 లక్షల 68 వేల 963 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.