శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టంలేదు.. కేసీఆర్ ఎక్కడ పుట్టారు? వైఎస్ షర్మిల

తాను తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడం తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వైఎస్. షర్మిల అన్నారు. పైగా, తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదన్నారు. తన స్థానికతపై వస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడ పుట్టారని సూటిగా ప్రశ్నించారు. ఒకరు ఉద్యమం, మరొకరు మతం అంటూ రాజకీయాలు చేయడం తప్ప.. ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదన్నారు. 
 
హైదరాబాద్‌లోని లోట్‌స్ పాండ్‌లోని తన కార్యాలయంలో ఆమె బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని స్పష్టం చేశారు. 'నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను. నా భర్త అనిల్‌ ఇక్కడివారే. పిల్లలనూ ఇక్కడే కన్నాను. నాకు తెలంగాణలో పార్టీ పెట్టే హక్కు ఎందుకులేదు?' అని ప్రశ్నించారు. జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తనకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉందని, తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.  
 
ముఖ్యంగా, తన సోదరుడు జగన్‌కు తాను తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించడం తన సోదరుడు జగన్‌కు ఇష్టంలేదని చెప్పారు. పార్టీ పెట్టే విషయంలో తన భర్త అనిల్‌ పూర్తి సహకారం ఉందని, తల్లి విజయమ్మ నుంచి కూడా పూర్తి మద్దతు ఉందని తెలిపారు. తాను ఎవరూ వదిలిన బాణాన్ని కాదని షర్మిల స్పష్టం చేశారు. 
 
ఏపీ సీఎంగా జగన్‌ ఆ రాష్ట్ర సంక్షేమాన్ని కోరితే, తెలంగాణ కోడలిగా తాను ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుతున్నానని చెప్పారు. జగన్‌కు, తనకు మధ్య పార్టీ పరమైన విభేదాలు తప్ప.. వ్యక్తిగతమైన విభేదాలు లేవన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధి కోసం తాను జగన్‌ను ఎదరించడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ లేవన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. 
 
సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సకే పరిమితమయ్యారని, ఆస్పత్రుల దోపిడీపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయో కూడా ముఖ్యమంత్రికి తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కంటే ఉద్యోగాలు ఇవ్వడం మేలు కదా? అని అన్నారు.
 
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు గత ఏడాది ఆగస్టులోనే వచ్చిందని షర్మిల తెలిపారు. వైసీపీలో తనకు జగన్‌ ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. తాను జగన్‌ దగ్గర కూర్చొని గట్టిగా అడిగితే కోరిన పోస్టు ఇవ్వరా! అని ఓ ప్రశ్నకు సమాధానంగా షర్మిల చెప్పారు.
 
తెలంగాణలో తాను కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీపై ప్రకటన త్వరలోనే ఉంటుందన్నారు. పార్టీ అధికార ప్రతినిధుల వివరాలనూ వారం రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందని, మార్గమధ్యంలో అమరుల కుటుంబాలనూ పరామర్శిస్తానని తెలిపారు.