పత్తికొండ సినిమాస్ ప్రారంభమైంది
గతంలో 'సరదాగా అమ్మాయితో', 'రాజు మహారాజు' చిత్రాలను నిర్మించిన కుమారస్వామి ఆధ్వర్యంలో పత్తికొండ సినిమాస్ పతాకంపై నూతనంగా మరో చిత్రం ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో శనివారం ముహూర్తపు షాట్ను చిత్రించారు. అర్జున్ యజత్, మౌర్యాని హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. వీరిపై 'భారతదేశం నా మాతృభూమి.. నా దేశాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రేమిస్తూనే ఉంటాను' అనే డైలాగ్ చిత్రించారు. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు క్లాప్ కొట్టగా, పత్తికొండ కుమారస్వామి కెమేరా స్విచ్చాన్ చేశారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర దర్శకుడు భానుశంకర్ మాట్లాడుతూ... ఈ కథను పెద్ద హీరోతో చేయాలనుకున్నాం. కీలమైన ఓ గెటప్ వేయాల్సి రావడంతో ఎవ్వరూ ముందుకురాలేదు. దాంతో కొత్తవారిని తీసుకున్నాం. సిన్సియారిటీకి మారుపేరైన వ్యక్తి కథ ఇది. ప్రేమకథ కూడా ఉంది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు. దేశానికి సంబంధించింది. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని' తెలిపారు. చిత్ర నిర్మాత ఎం.రవికుమార్ తెలుపుతూ... దర్శకుడు మిత్రుడు. మంచి కథ చెప్పాడు. ఇది ప్రజల్లో నుంచి పుట్టిన కథ. కుమారస్వామిగారు చాలా సహకరిస్తున్నారని అన్నారు.
కుమారస్వామి మాట్లాడుతూ... నా బేనర్లో రవిగారు నిర్మిస్తున్న చిత్రమిది. నా బేనర్లో 'సరదాగా అమ్మాయితో' భాను చేశాడు. వీరు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలి. ఈ చిత్రం విజయంపై మరిన్ని చిత్రాలు తీయడానికి అవకాశం ఉంది అన్నారు. 'దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చింది. ఇంకా బాణీలు ఇవ్వాల్సి ఉందని' సంగీత దర్శకుడు రవివర్మ అన్నారు. ఈ చిత్రంలో మంచి పాత్రలు పోషిస్తున్నట్లు హీరోహీరోయిన్లు, జ్యోతి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీనివాస్, ఆర్ట్: డి.వై. సత్యనారాయణ, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: భానుశంకర్.