'మేరీ కోమ్' ఫట్మంటే నా హృదయం పగిలినట్టే: ప్రియాంకా చోప్రా
ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథను నేపథ్యంగా తీసుకుని తీసిన చిత్రం "మేరీ కోమ్". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైతే తన హృదయం పగిలిపోతుందని ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా చెపుతోంది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం విడుదలపై ప్రియాంకా చోప్రా స్పందిస్తూ ఎంతో శ్రమకోర్చి, తన శక్తినంతా పెట్టి మరీ ఇందులో నటించాను. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ బీపీ పెరిగిపోతోంది. తన ఆత్మనంతా చిత్రంలో పెట్టుబడిగా పెట్టానని, బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైతే తన హృదయం పగిలిపోతుందని చెపుతోంది.
'నేను చాలా కష్టాలలో ఉన్న సమయంలో ఈ చిత్రం మొదలుపెట్టాం. నాలుగు రోజులకే నా తండ్రి మరణించారు. దాంతో, నా బాధ సహా ప్రతిదీ ఈ మూవీలో చూపించా. షూటింగ్ సమయంలో ప్రతిరోజు నాకో ఛాలెంజ్గా ఉండేది. ప్రతిరోజు ఇంటికెళ్లాక నేను చేయగలనా? అని మా అమ్మను అడిగి ఏడ్చేసేదాన్ని. మళ్లీ సెట్స్కు మామూలుగా వెళ్లేదాన్ని అంటూ ప్రియాంక ఉద్విగ్నంగా చెప్పుకొచ్చింది.