అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ
బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ పెద్ది చిత్రంలో నటించారు. ఈ పాత్ర ఎంతో కీలకం. వచ్చే నెల 4వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, దివ్యేందు శర్మ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను నటించడానికి గల కారణాలను వివరించారు.
'నేను ఉత్తరాఖండ్లో షూటింగ్లో ఉన్నప్పుడు ఈ చిత్ర బృందం నుంచి ఫోన్ వచ్చింది. వీలున్నప్పుడు వస్తాను అని చెప్పా. తర్వాత 'మిమ్మల్ని కలవాలి' అని బుచ్చిబాబు చాలా మెసేజ్లు పెట్టారు. దీంతో నేను ఆ షూట్ మధ్యలోనే ఆపేసి ఎంతోసేపు ప్రయాణించి చాలా కష్టపడి అక్కడినుంచి ఇక్కడికి వచ్చాను. బుచ్చిబాబును చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో ప్రేమతో వ్యవహరించారు. కళకు ఎంత గౌరవం ఇస్తారో చూశాను. నా పాత్రను వివరించేటప్పుడే నిర్ణయించుకున్నా. ఈ సినిమా ఎలా ఉన్నా బుచ్చిబాబు కోసం చేయాలి అని. వెంటనే ఓకే చేశా. ఆయన నన్ను అంత ప్రభావితం చేశారు' అని దివ్యేందు తెలిపారు.
ఇక పెద్ది కథ గురించి మాట్లాడుతూ..'స్టోరీ చూసి షాక్ అయ్యాను. ఎంత గొప్పగా రాశారో అనుకున్నా. ఎన్నో ట్విస్ట్లు, గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. గుర్తింపు కోసం ఎంత యుద్ధమైనా చేయొచ్చని ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. 'పెద్ది' తన గుర్తింపు కోసం ఎంతో పోరాడతాడు. ఆ అంశం నాకు చాలా నచ్చింది' అని చెప్పారు.
