Actress Eesha Rebha: ఇన్స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా
నటి ఈషా రెబ్బా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లపై అసభ్యకరమైన వ్యాఖ్యల ద్వారా వేధింపులకు గురవుతున్నానని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, ఒక గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తనను లక్ష్యంగా చేసుకుని పదేపదే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించిన తర్వాత చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సైబర్ వేధింపులపై ఈషా రెబ్బ తీసుకున్న ఈ గట్టి నిర్ణయానికి నెటిజన్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. సెలబ్రిటీలైనా, సాధారణ మహిళలైనా ఇలాంటి వేధింపులను అస్సలు ఉపేక్షించకూడదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల మాటున దాక్కుని ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారికి ఈ కేసు ఒక హెచ్చరికలా మారుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈషా చూపిన ఈ ధైర్యం వేధింపులకు గురవుతున్న ఇతర మహిళల్లో కూడా స్ఫూర్తిని నింపుతోంది. ఇక ఇటీవల జనవరి 30 న ఇషా రెబ్బా, తరుణ్ భాస్కర్, నటించిన ఫ్యామిలీ డ్రామా ఓం శాంతి శాంతి శాంతి రిలీజ్ అయింది.