'చిరుజల్లు' దర్శకుని మరో చిత్రం: కాశ్యప్, చాందిని జంటగా..!
కాశ్యప్, చాందిని జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మాణంలో నూతన చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కిషోర్ పార్థసారథి క్లాప్ కొట్టగా.. బసిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరాం బాలాజీ మాట్లాడుతూ.. నేను చేసిన 'చిరుజల్లు' సినిమా చూసి నిర్మాత అవకాశం ఇచ్చారు. మార్చి మొదటివారం నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభించి మే చివరి వారానికి పూర్తి చేసి జూన్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇదొక రొమాంటిక్, ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఫన్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు.
నిర్మాత జాహ్నవి మాట్లాడుతూ.. ఫ్యామిలీ మొత్తం చూడదగిన సినిమా ఇది. మార్చి నుండి ఏప్రిల్ వరకు కంటిన్యూస్ షూటింగ్ నిర్వహించనున్నాం. ఆ తరువాత పాటల చిత్రీకరణ జరిపి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్లో వస్తోన్న మొదటి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కాశ్యప్ మాట్లాడుతూ.. నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్లో శిక్షణ పూర్తి చేశాను. ఈ సినిమా కథ నచ్చి నా తల్లితండ్రులే సినిమాను నిర్మిస్తున్నారు. ఏదో ఒక్క సినిమా చేసి వెళ్ళిపోవాలని లేదు. ఇక్కడే లాంగ్ లైఫ్ ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు.
సంగీత దర్శకుడు బంటి మాట్లాడుతూ.. సినిమాకు మంచి ట్యూన్స్ కుదిరాయి. ఆసక్తి కలిగేలా పాటలను కంపోజ్ చేస్తున్నాం. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి వంటి వారు సాహిత్యాన్ని అందిస్తున్నారని చెప్పారు.