ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేస్తోంది. ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్టు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అతి తక్కువ సమయంలో రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
అంతేకాదు, బుక్మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటివరకూ 20 మిలియన్ టికెట్లు విక్రయమయ్యాయి. మల్టీప్లెక్స్ల్లో కూల్గా నవ్వులు పంచుతున్న ఈ మూవీ.. బీ, సీ సెంటర్లలో జాతరకు ఏమాత్రం తీసిపోవడం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఈ మూవీని ఆస్వాదిస్తున్నారు.
ఇక ఇప్పటివరకూ చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.244 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ తర్వాత 'వాల్తేరు వీరయ్య' రూ.232 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఈ వసూళ్లన్నీ ఫుల్ థియేట్రికల్ రన్లో వచ్చినవే. కానీ, ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు' కేవలం నాలుగున్నర రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.