ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా
ఒక వర్గానికి చెందిన అభిమానులు 'పరాశక్తి' చిత్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర దర్శకురాలు సుధా కొంగరా ఆరోపించారు. శివకార్తికేయన్, జయం రవి, అధర్వ మురళి, శ్రీలీలలు జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.
ఈ నేపథ్యంలో పరాశక్తి చిత్రంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై దర్శకురాలు సుధా కొంగరా స్పందించారు. 'పరాశక్తి'పై కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 'ప్రస్తుతం ఓ సినిమాను ప్రేక్షకులకు అందించడం చాలా కష్టంగా మారింది. ఎన్నో సవాళ్లు దాటాల్సి వస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.
ఈ సంక్రాంతికి మా 'పరాశక్తి' మరింత ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నా. ఒక వర్గానికి చెందిన అభిమానుల వల్ల మేం ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫేక్ ఐడీలతో మాపై దారుణమైన పోస్ట్లు పెడుతున్నారు. ఇందంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు' అని సుధా అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల 'పరాశక్తి' నిర్మాతల్లో ఒకరైన దేవ్ రామ్నాథ్ విజయ్ ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని సినిమాను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. 1965లో తమిళనాడు రాష్ట్రంలో జరిగరిన హిందీ వ్యతిరేక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. జనవరి 10న ఈ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా విడుదలై ప్రేక్షకుల పాజిటివ్ టాక్తో విజయాన్ని సొంతం చేసుకుంది.