రివ్యూలు సామాన్య ప్రేక్షకులకు రక్షణ కవచంలా నిలుస్తాయి : రాంగోపాల్ వర్మ
ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ చిత్రానికి రివ్యూ రాయడం కూడా ఒక రకమైన సామాజిక సేవేనని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రేక్షకుల జేబుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని ఆయన కితాబిచ్చారు. సినిమాలకు నెగెటివ్ రివ్యూలు రాయడం వల్లే థియేటర్లకు జనాలు రావడం లేదని, వ్యతిరేక ప్రచారం సినిమాలను దెబ్బతీస్తున్నాయనే చర్చ చిత్రపరిశ్రమలో జోరుగా సాగుతోంది. దీనిపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం పని చేసేవాళ్ళు కాదని, వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఒక సినిమా చెత్తగా ఉన్నపుడు ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని, అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఒక విమర్శకుడు హెచ్చరిస్తే, అది ఒక రకమైన ప్రజాసేవ లేదా దాతృత్వంతో సమానమవుతుందన్నారు.
ఈ రోజుల్లో సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్జీవీ గుర్తు చేశారు. ఒక సామాన్య కుటుంబ థియేటర్కు వెళ్లాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రివ్యూవర్లు సామాన్య ప్రేక్షకుడి జేబుకు ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారని కొనియాడారు. సినిమా నచ్చకపోతే రివ్యూల వల్ల ఫ్లాప్ అయిందని నిర్మాతలు ఏడవడం మానేసి, కంటెంట్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోవాలనే అర్థం వచ్చేలా వర్మ చేసిన కామెంట్స్ ఇపుడు టాలీవుడ్ వైరల్ అయ్యాయి.
