ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక
Vijay Deverakonda, Rashmika Mandanna at New York City
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మన మూడు రంగులు చూడటం సంతోషాన్ని కలిగిస్తోందని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశానికి గర్వకారణమైన క్షణం నేడు. న్యూయార్క్ నగరంలో జరిగిన 43వ ఇండియా డే పరేడ్లో సంచలనాత్మక గ్రాండ్ మార్షల్స్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సత్కరించబడ్డారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ. మాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖినః అనే థీమ్తో జరిగిన పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ సంఖ్యలో అమెరికాలోని ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్ ను విజయ్ దేవరకొండ స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రవాస భారతీయ సోదరులు మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై మన మూడు రంగులు చూడటం సంతోషాన్ని కలిగిస్తోంది. దేశం కోసం వీళ్లు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఈ రోజు ఇంత ఆనందంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. అన్నారు.