బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (19:18 IST)

సీబీఐ కస్టడీకి చిదంబరం... రోజూ లాయర్లు కలిసే ఛాన్స్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంకు సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగు రోజులు సీబీఐ కస్టడీని విధించింది. ఆయన్ను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి, రాత్రంతా అక్కడే ఉంచారు. ఆ తర్వాత గురువారం కొన్ని గంటల పాటు విచారించి ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 
 
ఆ తర్వాత ఇరు తరపు న్యాయవాదుల వాదనలు ఆలకించిన సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి... నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించారు. వాస్తవానికి చిదంబరంను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. కానీ, జడ్జి మాత్రం సీబీఐ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ నాలుగు రోజుల కస్టడీ విధించారు. 
 
దీంతో ఈ నెల 26వ తేదీ వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. అయితే, చిదంబరం కుటుంబసభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు రోజూ చిద్దూను కలవవచ్చని కోర్టు పేర్కొంది. అలాగే, చిదంబరంకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని జడ్జి ఆదేశించారు. 
 
అంతకుముందు... సీబీఐ కోర్టులో గురువారం మధ్యాహ్నం సమయంలో చిదంబరాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో న్యాయమూర్తి చిదంబరంకు మాట్లాడే అవకాశం కల్పించారు. జడ్జి అనుమతితో మాట్లాడిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకుగాను జూన్ 6 నాటి ట్రాన్స్‌క్రిప్ట్‌ను పరిశీలించాలని  కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 
 
సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని వెల్లడించారు. తనతో పాటు, తన కుమారుడి అకౌంట్ల వివరాలను కూడా అందించినట్టు తెలిపారు. తాను ఐదు మిలియన్ డాలర్ల లంచాన్ని అడిగానన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు.