శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:57 IST)

భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ అస్త్రాలు - వచ్చే నెలలో 6 విమానాలు రాక

భారత రక్షణ శాఖ అమ్ములపొదిలోకి రాఫెల్ అస్త్రాలు వచ్చి చేరనున్నాయి. ఇవి వచ్చే నెలలో వచ్చి చేరవొచ్చని భావిస్తున్నారు. నిజానికి భారత్ - చైనా దేశాల మధ్య  లడఖ్ వాస్తవాధీన రేఖ ప్రాంతం ఇపుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు సైనికాధికారుల చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు వ్యూహాత్మకంగా ఇరు దేశాల సైనిక బలగాల మొహరింపులు జరుగుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, చైనా తన అత్యాధునిక జెట్ యుద్ధ విమానాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ తరుణంలో భారత్‌కు సరైన ఆయుధాలు చేతికి అందనున్నాయి. ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలలోనే భారత్‌కు రానున్నాయి.
 
ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే నెలలో 4 రాఫెల్ యుద్ధ విమానాలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం 6 విమానాలు పంపాలని భారత్ కోరింది. ఈ విజ్ఞప్తికి ఫ్రాన్స్ సానుకూలంగా స్పందించడం విశేషం.
 
రాఫెల్ యుద్ధ విమానాలకు అత్యాధునిక క్షిపణులు అమర్చి ఉంటాయి. గగనతలంలో రాఫెల్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విమానాలు చాలా తక్కువ. చైనా వద్ద ఉన్న జేఎఫ్-17, జే-11, జే-8 ఫైటర్ విమానాలు కూడా సామర్థ్యంపరంగా ఉన్నతశ్రేణికి చెందినవే అయినా, రాఫెల్‌కు అమర్చిన మెటియోర్, స్కాల్ప్ క్షిపణులు భారత్‌కు ఖచ్చితంగా పైచేయి సాధిస్తాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
బియాండ్ విజువల్ రేంజ్ (దృశ్య పరిధి)ని మించిన లక్ష్యాలను ఛేదించడంలో మెటియోర్ క్షిపణులు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి కాగా, స్కాల్ప్ క్షిపణి స్థిరమైన లక్ష్యాలనుపైకి ముందస్తు పథకం ప్రకారం దాడులు చేసేటటప్పుడు తిరుగులేని సామర్థ్యం ప్రదర్శిస్తుంది.