గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 2009
  4. »
  5. శ్రీవిరోధి నామ సంవత్సర ఉగాది
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

శ్రీవిరోధి నామ సంవత్సరం ఉగాది సంబరం

WD
ప్రపంచంలోకెల్లా విశిష్ట సంస్కృతి వైభవం కల్గిన దేశం భారతదేశం. ఈ వేదాల పురిటి గడ్డలో ప్రతి ఆచారానికీ ఎంతో అర్ధముంది. ప్రతి సాంప్రదాయానికి మరెంతో పరమార్ధం ఉంది. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మగా వెలుగొందుతున్న 'తెలుగునేల' జరుపుకునే పండుగలలో ప్రత్యేకమైనదీ, సందేశాత్మకమైనదీ 'ఉగాది' పండుగ.

పురాణాకాలం నుండి వస్తున్న 'పండుగలు' కొత్త సంరంభాల్నే కాదు జీవిత సత్యాలను మోసుకొస్తూ స్థానిక ముంగిళ్ళలో కొంగ్రొత్త కాంతులు ప్రసరింపచేస్తాయి. తదనుగుణమైన పండుగులలో ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే 'ఉగాది' పండుగ తెలుగువారికి భవిష్యత్ కాలానికి బాటలు వేసే అరుదైన, అద్భుతమైన పర్వదినం.

శ్రీవిరోధి నామ సంవత్సరం.... సంవత్సరాది, యుగాది, ఉగాది....నామధేయాలతో అర్ధవంతమైన సాంప్రదాయాల ద్వారా తెలుగువారికి వ్యక్తవ్య, కర్తవ్యాలను సముచితరీతిలో నిర్దేశించే తొలి పర్వదినం ఉగాది. యుగము అనగా జంట. ఉత్తరాయణ, దక్షిణాయనముల జంటను సంవత్సరంగా భావిస్తే ఈ ఉగాది 'సంవత్సరాది' వికృతిలో 'ఉగము'గా శబ్ధీకరించబడినదే యుగము.

సంవత్సరాది మన భవితకు సూచిక. అందువల్లనే తిథి, వార, నక్షత్ర యోగ, కరణాలను తెలిసే నూతన వత్సర పంచాంగమును ఉగాది పర్వదినమున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నూతన వత్సర పంచాంగము నిర్ధేశిస్తున్న తమ జన్మఫలాలను అవలోకించి తమ భవిష్యత్ ప్రణాళికను సముచిత రీతిలో తయారు చేసుకుంటారు. అందువలన భవిష్య జీవనంలో ఎదురయ్యే పెక్కు ఇబ్బందులను సుళువుగా సంభాళించుకొనగలుగుతారు.

సంవత్సరాది పర్వదినాన నిర్వర్తించవలసినవిగా పలు ధర్మాలు చెప్పబడినవి. వాటిలో తైలాభ్యంగ సంకల్పం, మండప నిర్మాణం, నూతన వత్సదేవాతారాధన, నింబకుసుమ రసాయన భక్షణం, నూతన పంచాంగ శ్రవణం, కళాగోష్ఠి ముఖ్యమైనవి.

ఆరోగ్య ప్రాప్తిని అందించే 'వేపపూత పచ్చడి'ను సేవించడం తప్పనిసరి. షడ్రుచుల కలగలుపైన ఈ మేలు మిశ్రమం దైహిక బాధలను తొలగించుటలో ఎన్నదగినది. దీనిలో కలుపబడే చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, గసగసాలు, చెరకుముక్కలు, పచ్చిమామిడి ముక్కలు ఇత్యాదులు అత్యుష్ఠ వాతావరణం వలన కలిగిన ఇవి ఈతి బాధలను నివృత్తి చేస్తాయి.

అంతేకాక 'ఉగాది పచ్చడి' సేవనంలో అద్భుతమైన పరమార్థం కూడియున్నది. రానున్న వత్సరంలో తీపి, పులుపు, చేదు తదితరములతో పోల్చదగిన అనుభవాలను సమదృష్టిలో స్వీకరించే, పటుతర శక్తిని అలవరచుకోవాలనేదే అందలి సంత్సందేశము. వసంత ఋతువులో ఉదయించే ఉగాది లావణ్యతకు చిహ్నం. అందుచేతనే ఉగాది పర్వదినము నుండి శ్రీ రామనవమి వరకు వసంత నవరాత్రులు నిర్వహించి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నెరపుట తెలుగువారి సాంప్రదాయం.