భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్
ఏపీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న భర్త తనతో మాట్లాడేందుకు సమయం కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.
ప్రొద్దుటూరుకు చెందిన చందనా జ్యోతి (25)కు కొత్తగూడెంకు చెందిన బి.వెంకటసాయి యశ్వంత్తో ఈ యేడాది ఆగస్టు 14వ తేదీన వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ మూసాపేట పరిధిలోని ఆంజనేయ నగర్లో ఉంటున్నారు. చందనాజ్యోతి సాఫ్ట్వేర్ ఉద్యోగి, వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. భర్త యశ్వంత్ మెడ్ప్లస్ సంస్థలో పనిచేస్తున్నాడు.
చందనాజ్యోతి భర్త ఉదయం వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తున్నాడు. అసలే కొత్తగా వివాహం కావడం, ఇంట్లోనే ఉండటంతో ఆమె మానసిక వేదనకు లోనైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై భర్తతో గత రెండు మూడు రోజులుగా ఆమె గొడవపడింది.
శుక్రవారం ఈ దంపతులిద్దరూ చెరో గదిలో వేర్వేరుగా నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున యశ్వంత్ ఎంత పిలిచినా చందనాజ్యోతి స్పందించకపోవడంతో గది తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె దుప్పటితో ఉరేసుకుని కనిపించింది. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.