శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (15:37 IST)

ఎండిన ఓట్స్‌ను బకెట్ వేడి నీళ్లల్లో వేసి...?

ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతాయి. వీటితో ముఖానికి, చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. మరి చర్మం మెరుపుకోసం.. ఓట్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం..
 
చర్మం మీది మృతకణాలను ఓట్స్ తొలగిస్తాయి. పావుకప్పు ఓట్స్ తీసుకుని అందులో చక్కెర, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దాంతోపాటు అందం కూడా రెట్టింపవుతుంది.
 
ఒక కప్పు ఎండిన ఓట్స్‌ను మెత్తని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బకెట్ వేన్నీళ్లల్లో వేసి కలుపుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా రోజ్ వాటర్, లావెండర్ ఆయిల్, లెమన్ గ్రాస్ కలిపి 15 నుండి 20 నిమిషాల తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారతుంది. అంతేకాదు.. ఎండకు కమిలిన చర్మం పోతుంది.
 
స్పూన్ ఓట్స్‌లో కొద్దిగా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత వేడినీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే.. ముఖం మృదువుగా తయారవుతుంది. అలానే 2 స్పూన్ల ఓట్స్‌కు స్పూన్ తేనె, పాలు, ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి వలయాకారంలో రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.