శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:11 IST)

బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?

చర్మ సౌందర్యానికి క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ చాలానే ఉండొచ్చు. కానీ, వాటిని ఎన్ని రోజులని ఉపయోగిస్తాం.. అవి ఎంత అందుబాటులో ఉంటాయని ఎవ్వరు చెప్పలేం. చర్మానికి అందం, తాజాదనం రావాలంటే.. బియ్యం పిండి ఉపయోగిస్తే చాలంటున్నారు. బియ్యం పిండికి చర్మంలో అదనంగా ఉండే సిబమ్‌ను పీల్చి వేయడం ద్వారా చర్మాన్ని నిర్మలంగానూ, మృదువుగానూ తయారుచేస్తుంది.
 
బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ప్రత్యేకించి ముఖంలోని కండరాలు రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. దీని ఫలితంగా అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. ఇలాంటి పిండితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
పావుకప్పు బియ్యం పిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం అందాన్ని సంతరించుకుంటుంది. బియ్యం పిండిలోని యాసిడ్, అల్లాన్ టాయిన్ వంటి ఖనిజాలు చర్మంపైగల మృతుకణాలను తొలగిస్తాయి. 
 
స్నానానికి ముందు బియ్యం పిండిని వాడి సంప్రదాయం అప్పటి నుండే వస్తుంది. ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడుతాయి. బియ్యం పిండిలో కొద్దిగా అరటి పండు గుజ్జు, ఆముదం కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచు చేస్తే నల్లటి మచ్చలు పోతాయి.