శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (10:38 IST)

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు... సెకండ్ వేవ్ ముప్పు తప్పినట్టేనా?

దేశంలో కరోనా వైరస్ వేగం క్రమంగా తగ్గుతోంది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. సోమవారం 44 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, మంగళవారం 37 వేల‌పైచిలుకు కేసులు వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ తెలిపింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచాయి.
 
దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 37,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు సంఖ్య 91,77,841కి చేరాయి. ఇందులో 4,38,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 86,04,955 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 1,34,218 మంది క‌రోనా వ‌ల్ల‌ మ‌ర‌ణించారు. 
 
ఇందులో సోమవారం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 480 మంది మ‌ర‌ణించ‌గా, 42,314 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీరేటు 93.75 శాతంగా ఉంది. నిన్న దేశంలో 10.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అందులో 3.5 శాతం మంది అంటే 37,975 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 921 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,097 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,52,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,437కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,047 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 8,720 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.