శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:10 IST)

పావు కదిపిన బీజేపీ.. ఏపీలో సీఎం అభ్యర్థిగా చిరంజీవి.. పవన్‌తో భేటీ.. (video)

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని వార్తలు వస్తున్నాయి. సినీరంగంలో మెగాస్టార్‌గా అదరగొట్టిన చిరంజీవికి.. రాజకీయాలు మాత్రం కలిసిరాలేదు. దీంతో మళ్లీ సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టిన చిరంజీవికి మళ్లీ భారీ పొలిటికల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఆ ఆఫర్ విని తమ్ముడు పవర్ స్టార్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆఫర్ సంగతికి వస్తే..? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు తన రాజకీయాలు కొనసాగిస్తూనే కనీసం ఏడాదికి ఒక సినిమా చొప్పున నటించడానికి పవన్ ఇప్పటికే తనకు సన్నిహితులైన దర్శకులతో మంతనాలు జరుపుతున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో బీజేపీ పవన్‌ను కలిసిందని టాక్. పవన్‌ను బీజేపీకి చెందిన ఓ కీలక నేత కలిసి.. ఒక సూచనను పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా బీజేపీకి చెందిన ఓ కీలక నేత పవన్ ముందు ఓ మంచి సూచన పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే 2024 లేదంటే 2023 ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చిరంజీవిని బీజేపీ అభ్యర్ధిగా ప్రకటిస్తుందని.. దీనికి పవన్ తన 'జనసేన' పార్టీని కొనసాగిస్తూనే బిజెపికి రానున్న ఎన్నికలలో సపోర్ట్ ఇమ్మని కోరినట్లు తెలుస్తోంది.
 
ఈ సూచనను పూర్తిగా పవన్ తిరస్కరించకుండా అప్పటి పరిస్థితులను బట్టి తాను ఆలోచిస్తాననని సున్నితంగా సమాధానం ఇచ్చారట. అందుకే కొంతకాలంగా పవన్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలు గురించి మాత్రమే ఆలోచనలు చేస్తున్నాడు. 
 
అయితే వచ్చేనెల విడుదల కాబోతున్న 'సైరా' సక్సస్ స్థాయిని బట్టి భవిష్యత్ లో చిరంజీవి రాజకీయ ఆలోచనలు మారే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో రజినీకాంత్ కోసం గేలం వేస్తున్న బీజేపీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌లో చిరంజీవి కోసం పవన్ ద్వారా చేస్తున్న రాయబారం పంపుతోందని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం అన్నాతమ్ముళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.