శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 18 అక్టోబరు 2016 (19:11 IST)

శ్రీవారి సంపదను కొల్లగొట్టినవారి చిట్టా ఇది...

తిరుమల శ్రీవారిపై భక్తితో బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు కానుకలుగా సమర్పించిన రాజులు, పాలకులే కాదు.. శ్రీవారి ఆదాయాన్ని కొల్లగొట్టినవారు ఉన్నారు. చరిత్ర పుటలు తిరగేస్తే రాజులు, నవాబులు, ఆంగ్లేయులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, పాలేగాళ్ళు ఇలా అనేకులు స్వామివ

తిరుమల శ్రీవారిపై భక్తితో బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు కానుకలుగా సమర్పించిన రాజులు, పాలకులే కాదు.. శ్రీవారి ఆదాయాన్ని కొల్లగొట్టినవారు ఉన్నారు. చరిత్ర పుటలు తిరగేస్తే రాజులు, నవాబులు, ఆంగ్లేయులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, పాలేగాళ్ళు ఇలా అనేకులు స్వామివారి సంపదను కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. బ్రిటీష్‌ హయాంలో చిత్తూరు జిల్లాలో తహశీల్దారు గాను, ఆపై దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గానూ పనిచేసిన విఎన్‌ శ్రీనివాసరావు అనే అధికారి తిరుపతి వేంకటేశ్వర - బాలాజీ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. 
 
1949 సంవత్సరంలో ప్రచురించిన ఈ పుస్తకంలోని విశేషాలను..1998లో గోపీక్రిష్ణ అనే రచయిత రాసిన మన ఆలయాల చరిత్ర అనే పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని తితిదేనే ముద్రించింది. క్రీ.శ.1800 సంవత్సరం నుంచి తిరుమల చరిత్ర మొత్తం ఆంగ్లేయుల రికార్డుల్లో ఉంది. శ్రీనివాసరావు బ్రిటీష్‌ కాలంలో రెవిన్యూ, ఎండోమెంట్‌ శాఖల్లో పని చేయడం వల్ల ఆకాలం నాటి ఆంగ్లేయుల రికార్డులను పరిశీలించే అవకాశం లభించింది. వాటి ఆధారంగానే ఆయన తిరుపతి వేంకటేశ్వర - బాలాజీ పుస్తకాన్ని రాశారట. అందులోని వివరాలు.
 
ఇప్పుడైతే ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టబద్ధంగా ఏర్పాటైన తితిదే నిర్వహణలోని శ్రీవారి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అనేక ఆడిట్‌లు, తనిఖీలు ఉన్నాయి గానీ ఒకప్పుడు ఇవేవీ ఉండేవి కావు. పాలకులు ఇష్టారాజ్యంగా తిరుమల ఆదాయాన్ని తరలించుకు పోయేవారు. శ్రీవారి భక్తులను దోచుకునేవారు. ఇది ఎంతగా ఉండేదంటే తిరుమల కొండ ఎక్కినవారు దిగాలంటే 24 దుగ్గాండ్లు చెల్లించాల్సి వచ్చేదట. చెల్లించే దాకా కొండ దిగనిచ్చేవారు కాదట. బ్రాహ్మణులు, పేదలకు కొంత వెసులుబాటు ఉండేదట. క్రీ.శ.1801లో తిరుమల ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాక ఆ వెసులుబాటు కూడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి 12 అణాలు వసూలు చేశారట. అంటే ఒకరకంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులపైన పన్ను వేసేవారన్నమాట.
 
శ్రీవారికి వచ్చే ఆదాయంలో ఖర్చుల కోసం కేటాయించే డబ్బులూ క్రమంగా తగ్గిపోతూ వచ్చాయట. శ్రీవారి ఆలయ ఖర్చులకు యాదవరాజుల కాలంలో 100 శాతం ఇచ్చేవారట. విజయనగర చక్రవర్తులు 75 శాతం చేశారు. అందులోనూ శ్రీ రంగరాయల కాలంలో 50 శాతం అయ్యింది. మహ్మదీయుల కాలంలో 6 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఆలయ కౌలుదార్లుగా వచ్చినవారు ఇంకా తగ్గించి ఆదాయాన్ని సొంతానికి మిగలబెట్టుకోవడం ప్రారంభించారట. అంటే స్వామివారి ఆదాయాన్ని ఎంతగా తరలించుకుపోయారో అర్థం చేసుకోవచ్చు.
 
క్రీ.శ.1801 సంవత్సరంలో చంద్రగిరిని పాలిస్తున్న అజీమ్‌ ఉల్‌ ఉమ్రా అనే నవాబు 31.07.1801న చేసుకున్న ఒప్పందంతో తిరుమల శ్రీవారి హుండీ ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆంగ్లేయుల సేనలు చంద్రగిరికి రక్షణ కల్పించినందుకు యేటా 9 లక్షల నగదు చెల్లించేలా గతంలో నవాబుగా మహ్మద్‌ ఆలీ అగ్రిమెంట్‌ చేసుకున్నాడట. అజీమ్‌ ఉల్‌ ఉమ్రా వచ్చిన తరువాత ఆదాయంతో తనకు ఒక భాగం చెల్లించి మిగిలినది మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోవండి అనేలా ఒప్పందం చేసుకున్నాడట. అప్పటి నుంచి శ్రీవారి హుండీపైన పెత్తనం ఆంగ్లేయులకు వెళ్ళింది. ఇది నచ్చని పాలేగాళ్ళు దారి కాచి తిరుమలకు వచ్చే భక్తులను దోచుకునేవారట. దీంతో ఆంగ్లేయులే రహదారుల వెంబడి సైనికులను నియమించి భక్తులకు రక్షణ కల్పించారట. 
 
అంతేకాదు క్రీ.శ.1758 సెప్టెంబర్‌లో (బ్రహ్మోత్సవ సమయం) మెరచిన్‌ అనే ఫ్రెంచి అధికారి నెల్లూరు నజీబుల్లా, చంద్రగిరి అబ్ధుల్‌ వహాబ్‌ సేనలతో తిరుమలకు వచ్చాడట. స్వామివారి హుండీ దోచుకోవాలనుకున్నాడట. అయితే ఆలయ కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి తానే స్వయంగా కొంత డబ్బులు చెల్లించడంతో అతను వెనుదిరిగాడట.
 
క్రీ.శ.1782 జనవరిలో చంద్రగిరి కోటను హైదరాలీ ముట్టడించి కోటను స్వాధీనం చేసుకున్నాడట. అదే సమయంలో శ్రీనివాసమంగాపురం, తొండవాడ తిమ్మప్ప ఆలయం, అగస్తేశ్వరాలయం, తిరుపతిలోని అచ్చుతరాయపురం, యోగిమల్లవరంలోని పరాశరేవ్వరాలయాను కొల్లగొట్టాడట. అయితే తిరుమల ఆలయం జోలికి వెళ్ళలేదు. క్రీ.శ.1782 నుంచి క్రీశ. 1784 దాకా హైదరాలీ తరపున శ్రీవారి ఆలయాన్ని అతని ప్రతినిధి అయిన ఆనిగాళ్ల నరసయ్య అనే వ్యక్తి నిర్వహించినట్లు రికార్డుల్లో ఉంది. అంటే ఆ కాలంలో వచ్చిన ఆదాయం హైదరాలీకి చేరినట్లే అనుకోవాలి. ఇలా శ్రీవారి ఆదాయాన్ని కొల్లగొట్టారు చాలామంది.