గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (14:20 IST)

తితిదే వాహనాలకు ప్రతి యేటా ఖర్చు రూ.30 కోట్లు...!

ఆశ్చర్యపోతున్నారు కదూ... ఇది నిజంగానే నిజం. స్వామివారి వాహనసేవ సేవలకు కూడా ఇంత ఖర్చు కాదు. కానీ తితిదే వాహనాల్లో అధికారులు మాత్రం రయ్.. రయ్‌మని తిరిగేస్తే కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తున్నారు.

ఆశ్చర్యపోతున్నారు కదూ... ఇది నిజంగానే నిజం. స్వామివారి వాహనసేవ సేవలకు కూడా ఇంత ఖర్చు కాదు. కానీ తితిదే వాహనాల్లో అధికారులు మాత్రం రయ్.. రయ్‌మని తిరిగేస్తే కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తున్నారు. 
 
ప్రతి యేటా రూ.3 వేల కోట్లు ఆర్జిస్తున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడవాహనం, గజవాహనం, సింహవాహనం, చిన్నశేషవాహనం, పెద్దశేషవాహనం, ముత్యపుపందిరి వాహనం, కొయ్యతేరు, బంగారు రథం, ఇలా మొత్తంగా 10 వాహనాలు మించకపోవచ్చు. ఈ వాహనాల్లోనే స్వామివారు ఊరేగుతుంటారు. అయితే స్వామివారి సేవ కోసం నియమితులైన అధికారులు మాత్రం వందలాది వాహనాల్లో విహరిస్తూ స్వామివారిపైన మోయలేని భారం మోపుతున్నారు. స్వామి నిలబడి సంపాదిస్తుంటే అధికారులు గిరగిర తిరుగుతూ ఖర్చు పెడుతున్నారు. తితిదేలో అధికారుల వాహనాలకే ఏటా రూ.30 కోట్లు వ్యయం అవుతోందంటే అధికారుల వాహనసేవ ఎంత ఖరీరైనదో అర్థం చేసుకోవచ్చు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో కోట్ల రూపాయల ధనం వృధా అవుతోంది. అవసరం ఉన్నవారికి, అవసరం లేని వారికి వాహనాలు కేటాయించడంతో రవాణా ఖర్చు యేటా పెరిగిపోతోంది. వాహనాలు అధికార దర్పానికి సంకేతంగా మారిపోయి వాహన సదుపాయాన్ని దక్కించుకోవడానికి అధికారులు పోటీలు పడుతున్నారు. దీంతో సొంత వాహనాలు సరిపోక అద్దె వాహనాలను సమకూర్చాల్సి వస్తోంది. దేవదేవునికి భక్తులు భక్తితో కానుకలుగా సమర్పిస్తున్న వాహనాలు ఒక విధంగా స్వామివారికి భారంగా మారుతున్నాయి. జిల్లా ప్రభుత్వ పాలనా యంత్రాగాన్ని మించి వాహనాలు వినియోగిస్తున్న తీరుచూస్తూంటే దేవుడు డబ్బులు ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో అర్థమవుతుంది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసినవి గానీ, స్వామివారికి కానుకగా వచ్చినప్పటి నుంచి మొత్తం 500 వాహనాలకుపైగా ఉన్నాయి. ఇందులో భక్తుల రవాణాకు, సరుకుల రవాణాకు ఉపయోగపడే బస్సులు, లారీలు, వ్యాన్లు వంటివి తీసేస్తే అధికారుల రాకపోకలకు ఉపయోగపడే కార్లు, జీపులు వంటికి 250దాకా ఉన్నాయి. ఇది సరిపోవడం లేదని మరో 120 కార్లు అద్దెకు తీసుకున్నారు. అంటే అధికారుల రాకపోకల కోసం 370 వాహనాలు అధికారుల కోసం కేటాయించారు. ఇవి కాకుండా ద్విచక్ర వాహనాలు 100దాకా ఉన్నాయి. 
 
వాటిని కూడా కలుసుకుంటే 470 వాహనాలు అధికారుల సేవలో తరిస్తున్నాయి. ఈ వాహనాల డ్రైవర్లకు (రెగ్యులర్, కాంట్రాక్ట్ ) వారికి యేటా రూ.12 కోట్లు ఖర్చవుతోంది. డీజిల్, పెట్రోల్, స్పేర్ పార్ట్స్ కోసం మరో రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే రవాణా ఖర్చు ఏడాదికి రూ.30 కోట్ల రూపాయలు. రోజుకు దాదాపు రూ.8.21 లక్షలు. ఇక బస్సులు, లారీలు, సరుకు రవాణా వాహనాలను కలుపుకుంటే ఈ ఖర్చు ఇంకా ఎక్కువే అవుతుంది. 
 
తితిదేలో సొంత వాహనాలూ పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నాయి. సినిమా థియేటర్లు, పాఠశాలలు, మార్కెట్లు, బ్యూటీ పార్లర్లు, ప్రైవేట్ ఫంక్షన్లు.. ఇలా ఎక్కడబడితే అక్కడ తితిదే వాహనాలు కనిపిస్తుంటాయి. సెలవు రోజుల్లోనూ గిరగిరా తిరుగుతుంటాయి. అవన్నీ ఆఫీసు పనిమీదే తిరుగుతుంటాయని ఎలా అనుకోవాలి? తమ పిల్లల్ని స్కూల్ లో దింపడానికి, పిల్లలకు క్యారియర్ ఇచ్చిరావడానికి, సాయంత్రం పిల్లల్ని స్కూలు నుంచి తీసుకురావడానికి.. అన్నింటికీ తితిదే వాహనాలే. 
 
కొందరైతే తన జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే ఆమెను అక్కడ దింపి వచ్చేందుకూ తితిదే వాహనాలనూ వినియోగిస్తున్నారు. తితిదే వర్క్ షాపులోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్ళి ఇంధనం నింపుకున్నామా, తిరిగామా.. అన్నట్లు ఉంది అధికారుల దర్పం. ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్లు కూడా మాకెందుకులే అని గప్ చుప్ గా ఉంటున్నారు.