శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (10:55 IST)

ఇ-మెయిల్ పాస్‌వర్డ్‌లతో జర జాగ్రత్త... రూ.9 కోట్లు మాయం

ఇమెయిల్‌ల వాడకం, ఆన్‌లైన్ నగదు బదిలీలు సర్వసాధారణమైపోతున్న నేటి తరుణంలో ఇమెయిల్ హ్యాక్‌ల ద్వారా కోట్ల రూపాయలు కొట్టేసిన సంఘటన హైదరాబాద్‌లో బుధవారంనాడు వెలుగు చూసింది.
 
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఇంజినీరింగ్‌ వస్తువులను తయారుచేసే ఓల్టాంపెక్స్‌.. తన ఉత్పత్తులను పశ్చిమ ఆఫ్రికాలోని మాలే దేశానికి చెందిన డైమండ్‌ సిమెంట్‌ సంస్థకు కొంతకాలంగా ఎగుమతి చేస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఇరు సంస్థల మధ్య ఆన్‌లైన్‌‌లో జరుగుతూ ఉండేవి. ఈ మేరకు ఓల్టాంపెక్స్‌ సంస్థకు చెందిన ఎస్సార్‌నగర్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు ఆఫ్రికా నుంచి నగదు వస్తూండేది.

అయితే.. ఆయా లావాదేవీలపై కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల వివరాలను తెలుసుకొని... ఓల్టాంప్లెక్స్‌ ఇమెయిల్‌ను హ్యాక్‌ చేసి డైమండ్‌ సిమెంట్స్‌ సంస్థకు అమెరికాకు చెందిన బ్యాంకు వివరాలను పంపారు. బ్యాంకు ఖాతా వివరాలు మారాయనీ... ఇకపై తాము పంపిన కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయాలని మెయిల్‌లో పేర్కొన్నారు.

ఆమేరకు డైమండ్‌ సిమెంట్స్‌ 1,259,500 అమెరికన్‌ డాలర్లను(సుమారు రూ.9కోట్లు) కొత్త ఖాతాకు బదిలీ చేసింది. ఇంకా డబ్బు అందలేదని ఓల్టాంప్లెక్స్‌ ఆందోళనతో డైమండ్‌ సిమెంట్స్‌ ప్రతినిధులను ఫోన్‌ ద్వారా సంప్రదించగా అసలు మోసం వెలుగు చూసింది. కేసును  దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.