బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (10:44 IST)

సర్టిఫికేట్లు వరదలో తడిసిపోయాయా? అయితే కొత్తవాటి కోసం ఇలా చేయండి...

గత కొన్ని రోజులుగా తెలంగాణాతోపాటు హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో గత వారం రోజులు కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలతో పాటు బహుళ అంతస్తుల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద నీటితో పాటు.. వర్షాలు కారణంగా అనేక మంది విద్యార్థులు వివిధ రకాల ధృవీకరణ పత్రాలతో విద్యార్హత సర్టిఫికేట్లు కూడా కోల్పోయారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. 
 
విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు కోల్పోయిన వారు, పాడైయినవారు ఉంటే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఉచితంగా విద్యార్థుల సర్టిఫికెట్లను (ఫ్రెష్‌/డూప్లికేట్‌) జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్‌ బోర్డు, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు, విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు తాము పోగొట్టుకున్న, తడిచి పాడైపోయిన సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు తమ పేరు, పరీక్ష, హాల్‌ టికెట్‌ నెంబర్, సంవత్సరం తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.