శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (16:50 IST)

వారణాసికి టాటా... పూరీ నుంచి మోడీ పోటీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి కాకుండా పూరి స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా మాత్రం ఆయన పూరీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే మోడీ మరోసారి వారణాశి నుంచే బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
2014 ఎన్నికల్లో వడోదర, వారణాశి నియోజకవర్గాల నుంచి పోటీచేసి గెలిచిన నరేంద్రమోడీ... ఆ తర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేజ్రీవాల్‌ను చిత్తుచిత్తుగా ఓడించి భారీ మెజార్టీ దక్కించుకున్న మోడీ.. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే వారణాశి నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీ సాధించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
కానీ, మోడీ మాత్రం ఇప్పటివరకు తన మనసులోని మాటను వెల్లడించలేదు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒడిషా నుంచి బరిలోకి విషయాన్ని దిగబోతున్నారా? అన్న ప్రశ్నకు మోడీ సమాధానం దాటవేశారు. దీన్ని బట్టి మోడీ మదిలో పూరి, వారణాశి రెండూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిషా రాష్ట్రం నుంచి మోడీ స్వయంగా బరిలోకి దిగితే ఆ రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా బీజేపీకి మంచి మైలేజ్ వస్తుందని, ఇది బీజేపీ బాగా కలిసివచ్చే నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.