1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (21:06 IST)

న‌గ‌రిలో పొంగిన అభిమానం! ఎమ్మెల్యే రోజాకు రోజాల‌తో అభిషేకం!

నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే రోజాపై రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌... నేడు ఉప్పొంగిన అభిమానం... రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం అన‌డానికి ఇదో ఉదాహర‌ణ‌. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని తీవ్ర అస‌మ్మ‌తిని ఎదుర్కొన్న రోజాకి ఇపుడు అదే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆమె మంత్రి అవుతుంద‌నే ఊహాగానాల‌తో ఆమెని రోజా పూల‌తో ముంచెత్తుతున్నారు.
 
నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా సోమవారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. వడమాలపేట మండలం తట్నేరిలో ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి దళిత వాడ రోడ్డు ను ప్రారంభించారు.
 
అలాగే, వైఎస్సార్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి 30 వేల రూపాయల వంతున ఎమ్మెల్యే రోజా పంపిణీ చేశారు. 
 
పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా నెత్తిన రోజా పూలు త‌ట్ట‌ల కొద్ది జ‌ల్లి... ఆమెను రోజా పూ రెమ్మ‌ల‌తో ముంచెత్తారు. నాయ‌కులు, ప్ర‌జ‌ల అభిమానానికి రోజా ఉబ్బి త‌బ్బిబ‌య్యారు.