చిరు దృష్టంతా ''ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి''పైనే..!
|
ఈ పరిస్థితుల్లో చిరంజీవి తదుపరి ప్రణాళిక ఏమిటనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా.. ఎప్పటినుంచే ఓ చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న చిత్రాన్ని తీయాలనుకున్న ఆలోచనలకు ప్రస్తుతం పదును పెట్టారు. స్వీయ దర్శకత్వంలోనే ఆ సినిమాను తీయడానికి సంసిద్ధమయ్యారు. కర్నూలు ప్రాంతానికి చెందిన రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" జీవిత గాధను కథాంశంగా చేసుకున్నారు. "ఠాగూర్" చిత్రానికి ముందే ఈ కథ తొలి వెర్షన్ను చిరు సిద్ధం చేసుకున్నారట.
అప్పట్లో ఈ వార్తలను ఖండించిన చిరంజీవి.. ప్రస్తుతం దానికి కార్యరూపం పెట్టే ఆలోచన తప్పేట్లు లేదు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న కథకు పరుచూరి బ్రదర్స్ తదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే.. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను ఓ యువకుడికి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచన ఓ వైపు ఉండగా.. మరో వైపు ఆనాటి మహానటుడు ఎన్టీఆర్ బాటలో హీరో కమ్ దర్శకుడిగా వెళ్ళాలనే ఆలోచన కూడాఉంది.
ఈ కథపై చిరంజీవి అత్యంత శ్రద్ధ చూపడానికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదని ఆయన స్నేహితులు పేర్కొంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడిగానే గాక, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఎదురొడ్డిన వీరుడు. తెల్లదొరలను ఎదిరించడానికి చిన్నపాటి సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయమే చిరుని ఎంతగానో ఆకర్షించింది. ఆ సన్నివేశంలో సెంటిమెంట్తో పాటు.. దేశభక్తి ఆయనలో ఉప్పొంగి, వెంటనే చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్టు వినికిడి.
పైగా నరసింహారెడ్డికి ఇరువురు భార్యలు. రొమాంటిక్ లైఫ్తో పాటు.. వీరత్వం, దేశభక్తి ఉండటం వల్ల ఈ సబ్జెక్టును చేయడానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా.. ఈనెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజున ఈ చిత్రం విషయాలను అధికారపూర్వకంగా వెల్లడించవచ్చని సన్నిహితులు పేర్కొంటున్నారు.