మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం కథా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. కథా చర్చల కోసం చిత్ర దర్శకుడు వివి.వినాయక్ను అమెరికాకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇటు మీడియాకు, అటు అభిమానులకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ సంఘటనపై తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పి, తన అభిమానులు, రాజకీయనేతల్లో గౌరవం బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో తన కుటుంబ బాధను మరచి పోయేందుకు అమెరికా వెళ్లిన చిరు.. తదుపరి చిత్రంపైనే తన దృష్టంతా కేంద్రీకరించివున్నారు. కథా చర్చలు ముగిసిన తర్వాత అంటే సంక్రాంతికి హైదరాబాద్కు ఆయన తిరిగి రావచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన 'శంకర్దాదా జిందాబాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెల్సిందే. దీంతో తదుపరి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు.