"రోబో" జీవిత చరిత్రను ఆవిష్కరించిన చో
Publish: Fri, 7 Mar 2008 (13:20 IST)
Updated: Fri, 7 Mar 2008 (13:20 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్ర పుస్తకరూపం దాల్చింది. ప్రముఖ రచయిత్రి గాయత్రి రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి చెన్నైలో జరిగింది. ప్రముఖ సంపాదకుడు చో.రామస్వామి పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన జీవిత విశేషాలను ఎంతో ఓపికతో వివరించి సహకరించడం వల్లే తాను ఈ పుస్తకాన్ని పూర్తి చేయగలిగానని రచయిత గాయత్రి తెలిపారు. రజనీ జీవితం గురించి తెలుసుకోవడం ద్వారా యువత ఎంతో నేర్చుకోవచ్చని రచయిత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ డి.కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకంలో రజనీకాంత్ బాల్యం నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగే వరకు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న వివిధ అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇందుకోసం రచయిత్రి చెన్నై, బెంగుళూరులకు వెళ్లి, రజనీకాంత్ స్నేహితులను, బంధువులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకొని ఇందులో పొందుపరచడం గమనార్హం. అలాగే ఈ పుస్తకం ముద్రణరూపం దాల్చడం వెనుక రజనీకాంత్ జీవిత సహచరిణి లతా రజనీకాంత్ సహాయసహకారాలు ఎంతగానో అందిచారని రచయిత్రి గాయత్రి వివరించారు.