'బ్యాచిలర్స్', 'కుచ్చికుచ్చి కూనమ్మ' చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాకీర్ ప్రస్తుతం దర్శకునిగా మారి రూపొందించిన చిత్రం 'ఇదీ... అసలు కథ'. విజయమాధవి మూవీస్ పతాకంపై యం.ఎ.రాజు నిర్మాతగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎవిన్ సింగ్, ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ఫిలింఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు. రెండేళ్ల క్రితం సిద్ధం చేసుకున్న ఈ కథను ప్రస్తుతం తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం టాకీని పూర్తి చేసుకుందని, సోమవారం నుంచి పాటల చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తిచేసి జూన్ రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ బ్లాక్మెయిల్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారన్న విషయం మాత్రం సస్పెన్స్ అని అన్నారు. ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ చక్కని సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు.
ఈ చిత్రం హీరో ఎవిన్ సింగ్ మాట్లాడుతూ ముంబాయిలో మాడల్గా ఉండే తనను తెలుగు చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారని అన్నారు. థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా రూపొందించారని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా- మురళీ వై.కృష్ణ, ఎడిటర్- కె.రమేష్, పాటలు- తైదలబాపు, సహనిర్మాతలు- పి. జయంతి వర్మ, డి.రాఘవరాజు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం- జాకీర్.
|