బాలీవుడ్ అందాల నటి శ్రీదేవికి భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం నోటీసు జారీ చేసింది. రూ.పది కోట్ల రూపాయల విలువైన చెక్కు బౌన్సు కేసులో ఈ నోటీసు జారీ చేసింది. వచ్చే నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ముంబైకు చెందిన ఫైనాన్షియర్ మధు గుప్తా నటి శ్రీదేవికి రూ.పది కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చారు. ఇది తిరిగి చెల్లించే నిమిత్తం శ్రీదేవి చెక్కును ఇచ్చింది. అయితే ఈ చెక్కు బౌన్స్ కావడంతో ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
అయితే మధు గుప్తా చూపిస్తున్న చెక్కు తాను ఇచ్చినది కాదని, దానిపై సంతకాలు కూడా తాను చేయలేదని పేర్కొంటూ శ్రీదేవి ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు కింది కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా.. చెక్కుల్లో ఉన్న ఫోర్జరీ సంతకాలపై దర్యాప్తునకు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఫైనాన్షియర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అపెక్స్ కోర్టు నటి శ్రీదేవికి నోటీసు జారీ చేసింది.
|