మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల... అంటూ ఆంధ్రావనిని ఊపేసిన పాప్ గాయని స్మిత తాజా ఆల్బమ్ 'స్మిత' గురువారం మార్కెట్లోకి విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఆల్బమ్ రూపొందడం విశేషం. ఈ అల్బమ్ విడుదల కార్యక్రమం గురువారం రాత్రి హైటెక్ ప్రాంగణంలోని నవోటెల్ కన్వెన్షన్ హాల్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కినేని నాగార్జున ఆల్బమ్ సీడీలను విడుదల చేశారు. అలాగే ఈ ఆల్బం క్యాసెట్లను సంగీత దర్శకుడు రమణ గోగుల విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ స్మిత మామూలుగా కన్నా పోస్టర్పై చాలా హాట్గా ఉందని అన్నారు.
బయట ఉన్న స్మితకు తాను కూడా ఫ్యాన్నని ఆయన పేర్కొన్నారు. స్మిత మాట్లాడుతూ ఈ ఆల్బమ్ కోసం తాను లాస్ ఏంజల్స్లో పలు విభాగాల్లో శిక్షణ పొందానని అన్నారు. మూడు భాషల్లో విడుదలైన ఈ ఆల్బమ్కు షాజిద్, వాజిద్ చక్కని బాణీలను అందించారని తెలిపింది.
ఈ ఆల్బమ్లో మొత్తం తొమ్మిది పాటలుంటాయని ఆమె చెప్పింది. షాజిద్, వాజిద్ మాట్లాడుతూ స్మిత మంచి కమిట్మెంట్ ఉన్న గాయని అని అన్నారు. ప్రస్తుతం చేసిన ఈ ఆల్బమ్ ఆమె కలల ప్రాజెక్ట్ అని వారు తెలిపారు. ఈ ఆల్బమ్ గురించి స్మిత తీసకున్న జాగ్రత్త తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వారు అన్నారు.
మహి... మహి... అంటూ సాగే హిందీ పాటను సౌత్ గాయని పాడిందంటే నమ్మలేకుండా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు గుణ్ణం గంగరాజు, వి.ఎన్.ఆదిత్య, జెమిని కిరణ్, సుబ్బరాజు, శర్వానంద్. గీతరచయితలు సాహితీ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా ఈ ఆల్బమ్ మార్కెట్లోకి విడుదలైంది.
|