1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''మహేష్‌బాబు'', ''పూరీ'' కాంబినేషన్‌లో వార్నర్ బ్రదర్స్ చిత్రం

మహేష్‌బాబు
WD PhotoWD
మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో పోకిరీ చిత్రం సాధించిన ఘనవిజయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ హలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించనుండడం విశేషం. అంతేకాకుండా రజినీకాంత్ కుమార్తె సౌందర్య స్వంత బ్యానర్ అఖెర్ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనుంది.

ఈ చిత్రం గురించి సౌందర్య మాట్లాడుతూ మహేష్‌బాబు, పూరి కాంబినేషన్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుందని, వార్నర్ బ్రదర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని అన్నారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ పోకిరి తర్వాత మళ్లీ పూరీతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరి అంచానాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ నాకే ఓ కొడుకు ఉండుంటే పూరీ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం చేసేవాడని... అని రజినీకాంత్ గారు అంటే మీ డైరెక్షన్‌లో నన్ను నిర్మాతగా పరిచయం చేయండి అంటూ ఆయన కుమార్తె అడగడం గొప్ప విషయమని అన్నారు. వార్నర్ బ్రదర్స్‌తో కలిసి నిర్మిస్తున్న 10మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ సుల్తాన్‌కు డైరెక్టర్ అయ్యి ఉండి కూడా మీ డైరెక్షన్‌లో నిర్మాతగా ఛాన్స్ ఇవ్వండి అని అడగడం ఆమె సంస్కారానికి నిదర్శనమని అన్నారు.

వార్నర్ బ్రదర్స్‌తో కలిసి మూడు భాషల్లో చిత్రం చేయడం థ్రిల్‌గా ఉందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.
About Writer
Munibabu