ప్రముఖ హాస్యనటుడు పీలా కాశీవిశ్వనాథ మల్లికార్జున రావు మంగళవారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొద్దికాలంగా ఆయన లుకేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రెండురోజులు చికిత్స అనంతరం మంగళవారం ఉదయం 10.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
ప్రజల సందర్శనార్థం ఫిలింఛాంబర్కు ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. బుధవారం నాడు ఆయన స్వస్థలమైన అనకాపల్లిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మల్లికార్జున రావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.
మల్లికార్జునరావుకు 56 ఏళ్ళు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నతనంలో రెండవ కుమారుడు వ్యాధితో చనిపోయారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. నాటకరంగంలో ఆయనకు విస్తృత అనుభవముంది. సినిమా రంగానికి అదే బాటవేసింది. 27 ఏళ్ళ నటనా కెరీర్లో ఆయన 375 చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించారు. గురువు రావుగోపాలరావు ద్వారా తులసి (1973)లో ఆయనకు చిన్నవేషం దక్కింది.
ఆ తర్వాత "నాగమల్లి"లో నటించారు. కానీ వంశీ దర్శకత్వంలో రూపొందిన "లేడిస్ టైలర్"లో ఆయన పోషించిన బట్టల సత్యం ఆయన కెరీర్నే మార్చేసింది. ఏప్రిల్ 1 విడుదల, అనుమానాస్పదం, జంబలకిడిపంబ వంటి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
"తమ్ముడు" చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇకపోతే మల్లికార్జున రావుకు తెలుగుదేశంతో అనుబంధముంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రస్తుతం తెదేపా సాంస్కృతిక విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అదే విధంగా గతంలో "మా" ఉపాధ్యక్షుడుగానూ, ప్రస్తుతం "మా" కార్యదర్శి బాధ్యతలు పోషిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం "మహా నగరంలో..." ఇది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.
|