శ్రీకాంత్, ఛార్మీ జంటగా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రం "కౌసల్య సుప్రజ రామ". జులై 14 నుంచి 22 వరకు మలేషియా, లంకావి, కౌలాలంపూర్ ప్రాంతాల్లోని వివిధ లొకేషన్లలో ఈ చిత్రంలోని రెండు పాటలను హీరోహీరోయిన్లపై చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అనంతరం హైదరాబాద్లో జరిగే షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తామని, దీంతో సినిమా షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత రామానాయుడు తెలిపారు. బుధవారం వరకు జరిగిన షెడ్యూల్తో దాదాపుగా టాకీ పార్ట్ పూర్తయిందన్నారు.
కథ, స్క్రీన్ప్లేలు సమకూర్చిన సూర్యప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా కోసం సంగీత దర్శకులు రమణ గోగుల, ఎంఎం శ్రీలేఖ పాట పాడారని ఆయన అన్నారు. కౌసల్యా నచ్చావే.. అందంతో గిచ్చావే.. అంచేతే నచ్చావే.. అనే పాటకు వీరిద్దరు గొంతు కలిపారు. రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాయగా, ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇకపోతే శ్రీకాంత్ సరసన గౌరి మంజల్ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఇంకా కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంబీ శ్రీరామ్, భరణి, కృష్ణ భఘవాన్, ఆలీ, వేణుమాధవ్, శివారెడ్డి, ఉత్తేజ్, హేమ, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.
|