ముఫ్పైఏళ్ళ క్రితం బయోస్కోప్ను వివిధ రకాలకు చెందిన పేపర్ కటింగ్స్ పెట్టి వాటిని తిప్పుతూ "కాశీపట్నం చూడర బాబూ... అంటూ తమాషాలు చేసి పిల్లల్ని, పెద్దల్ని అలరించేవారు. అదే సన్నివేశంతో "కాశీపట్నం చూడరబాబూ.." అంటూ "ఖైదీ బాబాయ్"లో ఓ పాట కూడా ఉంది. చాలా రోజులకు ఆ లిరిక్ను టైటిల్గా ఎంచుకుని సినిమా రూపొందించేందుకు ఎం.ఎస్.ఎం. వెంకటసాయి సినీపార్క్ ముందుకు వచ్చింది. పెద్దవంశీ దగ్గర "సితార" నుంచి "అనుమానాస్పదం" వరకు పనిచేసిన మద్దిరాల వెంకట్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు.
విజయ్ ఆనంద్ హీరోగా, సుప్రేన హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ మే నెలలోనే ప్రారంభమై మంగళవారం (జూలై 15)తో ముగింపు దశకు చేరుకుంది. మంగళవారంనాడు సారధి స్టూడియోస్లో వేణుమాధవ్, భరణి, బెనర్జీ, గుండు సుదర్శన్ తదితరులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మరో మూడు రోజుల్లో టాకీ పూర్తవుతుందనీ, ఈ నెల 22 నుంచి మలేషియా, లంకావి, బ్యాంకాక్లో మూడు పాటల చిత్రీకరణ జరుగుతుందని దర్శకుడు మద్దిరాల వెంకట్ తెలియజేశారు.
"కాశీపట్నం..." అనే ఊరిలో జరిగిన కథను ఇతివృత్తంగా తీసుకుని, అక్కడ ఎక్కువగా మాయచేసే వాళ్ళ జీవితాల్లోని ఎంటర్టైన్మెంట్ను చక్కని స్క్రీన్ప్లేతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారని తనికెళ్ళ భరణి పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చిందనీ, పెద్దవంశీ దగ్గర పనిచేస్తున్న మద్దిరాలతో పరిచయం స్నేహంగా మారిందని, తాను నటుడిగా, మద్దిరాల దర్శకుడిగా ఊహించుకునేవాడిననీ... అది ఈ నాటికి నెరవేరడం థ్రిల్గా ఉందనీ చెప్పారు. ఇందులో ఊరి ప్రెసిడెంట్గా తాను నటిస్తున్నానని కృష్ణభగవాన్ అన్నారు.
గ్రామీణ వాతావరణంలో సిటీ కల్చర్ మిళితమయితే ఎలా ఉంటుందో.. ఈ చిత్రంలో దర్శకుడు బాగా చూపించబోతున్నారని నటుడు బెనర్జీ చెప్పారు. నటునిగా తొలిదశలో ఉన్న తనకు పెద్దతారాగణం ఉన్న చిత్రంలో నటించే అవకాశం రావడం పట్ల కథానాయకుడు విజయ్ హర్షం వ్యక్తం చేశారు.
"గోవా బాబీ కేటుబ్ టీవీ" అనే విచిత్రమైన పాత్రను ఈ చిత్రంలో తాను పోషిస్తున్నట్లు శివన్నారాయణ వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ.. ఎం.ఎన్. జవహర్ రెడ్డి, మాటలు.. రైటర్ మోహన్, ఆర్ట్.. క్రిష్టమాయ, ఎడిటింగ్... బస్వాపైడిరెడ్డి, సంగీతం.. చక్రి, నిర్మాణం.. ఎం.ఎస్.ఎం, దర్శకత్వం.. మద్దిరాల వెంకట్.
|