నాగబాబు ఫారెస్ట్ అధికారిగా నటిస్తోన్న "అరణ్యం" చిత్రం బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్ బేనర్పై ఎ.వి.రావ్, మాధురి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభమైన షూటింగ్లో కృష్ణమారుతి, ఫరాఖాన్ తదితరులపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. "6టీన్స్" ఫేమ్ జి. శ్రీనివాసరెడ్డి కెమేరా స్విచ్ఛాన్ చేయగా, మరో దర్శకుడు అమ్మ రాజశేఖర్ క్లాప్ కొట్టారు.
చిత్రం గురించి దర్శకుడు శ్రీధర్ చెబుతూ.."కలువ" చిత్రం షూటింగ్లోనే నాగబాబుకు ఈ చిత్ర కథ చెప్పడంతో నచ్చి ఫారెస్ట్ అధికారిగా నటిస్తానని అంగీకరించినట్లు చెప్పారు. మరో పాత్రను మాదాల రవి పోషిస్తున్నారని, ఇది విప్లవ సినిమా కాదని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే విధంగా ఉంటుందని ఆయన వివరించారు.
సామాన్యుడు ఓ సందర్భంలో అనుకోకుండా అడవిలోకి వెళితే అక్కడ ఎదురైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొని ఎలా బయటపడ్డాడు.. అన్న కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నట్లు శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఇందులో ప్రముఖ హీరో నటిస్తున్నారని, ఆ వివరాలు త్వరలో వెల్లడిచేస్తామని చెప్పారు.
తొలి షెడ్యూల్ వికారాబాద్ ఫారెస్ట్లో జరిపి అనంతరం హైదరాబాద్లో సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తి చేస్తామని, నిర్మాతల్లో ఒకరైన ఎ.వి.రావ్ చెప్పారు. మరో నిర్మాత మాధురి మాట్లాడుతూ... నాగేంద్రబాబు నటించడం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రముంటుందని చెప్పారు.
సస్పెన్స్ థ్రిల్లర్తో కూడిన ఈ చిత్రానికి సంగీత ప్రాధాన్యత ఉందని సంగీత దర్శకుడు సాహితీ శ్రీనివాస్ అన్నారు. ఇంకా మిగిలిన పాత్రలను కృష్ణభగవాన్, రామిరెడ్డి, బంగార్రాజు, శేఖర్, స్వాతి తదితరులు పోషించనున్నారు. కెమెరా... ధనుంజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. కొండవల్లి నందు, సహనిర్మాత... పీఠాపురం శ్రీను, రచన, దర్శకత్వం... మెండెం శ్రీధర్.
|